విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై కేంద్ర మంత్రి భూపతిరాజు స్పందన

  • విశాఖ స్టీల్ ప్లాంట్‌లో లాడిల్ పేలుడుతో ఘోర ప్రమాదం
  • ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన శ్రీనివాసవర్మ
  • మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన వర్మ
  • క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని వెల్లడి
  • పరిశ్రమల్లో భద్రతకే అత్యంత ప్రాధాన్యమని స్పష్టీకరణ
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో సోమవారం సాయంత్రం సంభవించిన లాడిల్ పేలుడు ప్రమాదంపై కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘోర ప్రమాదంలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ ఘటనపై స్పందించిన మంత్రి, ప్రమాదం జరిగిన వెంటనే ప్లాంట్ యాజమాన్యంతో పాటు స్థానిక అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని తాము నిశితంగా గమనిస్తున్నామని చెప్పారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

పారిశ్రామిక భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని శ్రీనివాసవర్మ స్పష్టం చేశారు. ఈ కష్ట సమయంలో కార్మికులకు, వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో సోమవారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ద్రవ ఉక్కుతో ఉన్న లాడిల్ ఒక్కసారిగా పేలడంతో ఎనిమిది మంది కార్మికులు మృత్యువాత పడగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

Bhupathiraju Srinivasa Varma
Vizag Steel Plant accident
RINL Visakhapatnam explosion
Ladle blast Vizag Steel

More Telugu News